Saturday, December 21, 2013

దానవులపాడు, జైన క్షేత్రము

ఈసారి దసరా పండక్కి ఇంటికి పోయినపుడు ఇంటర్మీడియట్ ఫ్రెండ్ ప్రసాద్ ఫోన్ చేసి "అరే దానవులపాడు పోదామా, బుద్దుని గుడి ఏదో ఉంది అంట, శాన  పాతది అంట కదా" అని అదిగాడు. చిన్నప్పుడు బళ్ళో చదివేటపుడు దానవులపాడు పక్క ఊరు దేవగుడి నుండి గంగాకుమార్ అనే ఫ్రెండ్ ఉండేవాడు. వాడు ఏదో ఒక సందర్భంలో ఈ గుడి ని చెప్పినట్లు గుర్తు . "సుమారు నూరేళ్ళ కిందట వాళ్ళ ఊరోడు ఒకడు చెంబు పట్టుకుని అటుగా పోయినాడు అంట, వాడికి అక్కడ ఇసుకలో ( పెన్నా నది ఉంది లే ఆ ఊరి పక్కన) ఇటుకలు దొరికినాయ్ అంట, ఊర్లో వాని నేస్తగాల్లకి  చెప్తే, వారు తల ఒక ఇటుక ఇంటికి పట్టుకపోయినారు, అది ఊర్లో వాళ్ళు చూసి అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి చెప్తే, వాళ్ళు ఇక్కడేదో ఉంది అని, ఇసుకని తవ్వితే అందులో ఈ దానవులపాడు గుడి బయట పడింది అంట అంతే కాకుండా ఆ బుద్దుని కింద 50 అడుగుల పాము ఒకటి ఉందని, అందుకే బుద్దుని కాళ్ళు కనపడకుండా మూసేశారని " ఇలా కథలు చెప్పాడు . అప్పుడేదో పిల్లగాళ్ళం అంతే కాకుండా మా ఊర్లో కూడా ఊర్లో గుడి నుంచి ఊరి బయట శివాలయం వరకు పెద్ద పాము ఉందని, ఒక్కడు ఎవరైనా అటువైపు వెళ్తే ఎత్తకపోతాది అని ఒక కథ ఉండేది . ఈ దానవులపాడు కథ కూడా ఒకే విధంగా ఉండేసరికి ఎప్పుడో ఒకసారి ఎవడో ఒకడు తోడు దొరికితే పోదాం అని వాయిదా వేశాం

ప్రసాద్ గాడు ఫోన్ చేసినపుడు ఈ జరిగిన కథ గుర్తొచ్చి "పోదాం రా, శాన్నల్ళ నుండి పోదాం అనుకుంటున్నా, టైం డేట్ చెప్పు, ఇంటి దగ్గర ఏం చేయడం లేదు, ఒక ట్రిప్ వేద్దాం అన్నాను" , వాడు 2 రోజుల తర్వాత అని చెప్పాడు, మనకి ఓకే . బస్సు లో వెళ్తే ఒక 2 కిమీ రోడ్డు నుండి లోపలికి నడవాలి కాబట్టి బండి అయితే మేలు అని రగ్గాడికి ఫోన్ చేశా. 'దానవులపాడు కి పొవాలి  అని రా, నీ బండి ఎవరు వాడరు కదా, ఒక రోజు తీసుకుంటా' అన్నాను. వాడు "సరే" అన్నాడు . ఇంకేం అన్ని సిద్ధం . కెమెరా కి చార్జింగ్ చేసి రెడీగా ఉంచుకున్నాను .

ఈ దానవులపాడు మా ఊరికి 20 కిమీ దూరంలో ఉంది. 2 రోజుల తర్వాత పొద్దున్నే 8గంటలకే స్టార్ట్ అయ్యాం . మనోడు గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతున్నాడు అంట సో దానవులపాడు చరిత్ర చెప్తూ ఉన్నాడు బండి వెనుక కూర్చుని, నేను బండి నడుపుతూ వింటూ అలా వెళ్తున్నాం . ఫస్ట్ టైం బండి నడపటం, అది కూడా డిస్కవర్ 125. ముందే చెప్పా ప్రసాద్ గాడికి "బాబు, మనకి బండి అంతంత మాత్రం, సో భరించాలి' అని. వాడు ఏం అనలేదు, "ట్రై చేద్దాం పద" అన్నాడు. దారిలో చాల విషయాలు మాట్లాడాం . చాల చెప్పాడు, వాడి ప్రిపరేషన్ గురించి

దానవులపాడు నిజంగా అయితే జైన తీర్థం, చుట్టుపక్కల వాళ్ళకి మాత్రం అది బుద్దుడి గుడి . వెళ్ళేదారిలో రోడ్ కొత్తగా వేస్తున్నారు . సో దారి తప్పిపోయాం . అప్పుడు రోడ్ పైన ఒక మనిషిని "ఇక్కడ జైన గుడి కి దారెటు" అంటే "అదెక్కడ, తెలీదు" అన్నాడు . "బుద్దుడి గుడి ఎక్కడ " అని అడిగితే "బుద్దుడి గుడా , ఆడ్నుంచి సందులో పొతే వస్తుంది  " అన్నాడు . మెయిన్ రోడ్ నుండి డైవెర్శన్ 2కిమీ లోపలికి. పక్కా ఊరు రోడ్, కంపలు, అటు ఇటు పొలాలు బాగుంది . మొత్తానికి 10 కి అక్కడికి చేరుకున్నాం . అక్కడ పెద్ద బోర్డు,  గుడి ఆరవ శతాబ్దంది  అని, కన్నడ, సంస్కృత శాసనాలు ఉన్నాయని రాసారు. లోపలికి వెళ్ళడానికి గేటు ఒకటి, దాటుకుని ముందుకి వెళ్తే, చిన్న జైన దేవాలయం . గత 1500 సంవత్సరాలుగా ఇసుకలో పూడుకుపోయి, ఈ మధ్యే త్రవ్వకాలలో బయటపడిన గుడి .

పూర్వం మా ఏరియా లో జైన మతం బాగా వ్యాప్తి లో ఉండేది అనుకుంటాను , చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం దానవులపాడు 'జైన మత కేంద్రం'. ఆ కాలంలో ఇక్కడి నుండే జైన మాట వ్యాప్తి చేసారు అంట . కేంద్రం అన్నారు కదా, చిన్న గుడే ఉంది అనుకున్నాను. కాని అప్పుడు ప్రసాద్ చెప్పాడు "ఇంకా ఉంది బాబు, ఇలా రా" అని గుడి నుండి పెన్నా నది ఒడ్డుకి పిలుచుకెళ్ళాడు. గుడి అంత గా ఏమిలేదు కాని పెన్నా లో కి స్నానం కోసం ఆ కాలం లో వాళ్ళు కట్టిన మెట్లు, పెన్నా వరదల ( ? ) నుండి కాపాడుకోవడానికి పెద్ద రాతి గోడ, దాని మీద చాల శిల్పాలు, చాల బాగున్నాయి .

ఆ కాలంలో అంత పెద్ద రాళ్ళతో అంత పొడవు గోడ ఎలా కట్టారో కాని, నిజంగా అద్భుతం . ఎందుకంటే దగ్గరలో ఈ రాళ్ళ గనులు లేవు, అది కాకుండా 6 వ శతాబ్దం లో కట్టింది, వింతే అనిపించింది నాకు. ఈ మెట్ల వరుసలో శిల్పాలు చూస్తే , జైనుల కూడా హిందూ మతం దేవుళ్ళు ని పూజించే వారు అని తెలుస్తుంది . వినాయకుడు, బాలకృష్ణుడు, చెట్టుకింద నిల్చున్న గోపికలు, నాగుపాము బొమ్మలు, ఇలా చాల ఉన్నాయి . ఇంకా మన జైనులని శృంగార అభిలాష కూడా ఎక్కువే ఉన్నట్లుంది . గోడ ని బాగా గమనిస్తే, చాల శిల్పాలు, రేఖా చిత్రాలు ఉన్నాయి . అయితే ఇవి గోడ, అదే గుడి కి దూరం గా ఉన్నాయి . కాబట్టి గుడి దగ్గర ప్రశాంతంగా ఉండు సామి, బయట ఏమైనా చేసుకో అని అర్థం అవుతుంది.

గోడ పొడవే ఒక కిలోమీటర్ ఉంటుంది , వెడల్పు ఒక అర కిమీ , దీన్ని బట్టి గుడి మొత్తం వైశాల్యం ఎంత పెద్దదో తెలుస్తుంది . ఈ ఏరియా లో పూర్వం జైనులు సల్లేఖనం పాటించే వారు అంట. అంటే ఉపవాసం చేస్తూ శరీరాన్ని కృశింప చేసుకోవడం . ఈ ప్రదేశం లో మన ఆర్కియాలజీ వాళ్ళకి తువ్వా మట్టి దొరికింది అంట, కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చారు .

ఇక గుడి లో జైన్ విగ్రహం దగ్గరికి వస్తే, 'విగ్రహం దిగంబరం గా ఉంది . తెల్ల రాయి శిల్పం . విగ్రహానికి అటు ఇటు శాసనాలు కలవు . గంగాకుమార్ చెప్పినట్లు పాదాలు భూమిలో కి పెట్టారు. ఆర్కియాలజీ వాళ్ళు కూడా నమ్మేసారమో పాము ఉందని . గుడి ఇటుకలతో కట్టబడినది . ఇటుకలు చాల పెద్దవి. ఆశ్చర్యం ఏమిటి అంటే ఇటుకలు చాలా ఖచ్చితమైన కొలతలతో చాలా బాగా తయారు చేసారు . ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి .

ఈ జైన గుడి పక్కనే అసంపూర్తిగా ఉన్న ఒక నిర్మాణం ఉంది. చూస్తే మన హిందూ గుడి నిర్మాణం లాగ ఉంది . ఎందుకో మరి పూర్తి చేయకుండా వదిలేశారు. అక్కడ గడ్డి కోసుకుంటూ కొందరు మహిళలు ఉన్నారు . మమ్మల్ని చూసి "యా ఊరయ్య మనది " అడిగారు . బహుశా ఇక్కడికి యాత్రికులు ఎవరు రారేమో, అందుకే మమ్మల్ని వింతగా చూస్తున్నారు . ఇక ఇంటికి వెళ్దాం అనుకుని బయలుదేరాం.

ఈ జైన గుడి బయట సీతా రామ లక్ష్మణ విగ్రహాలతో ఉన్న ఇంకో గుడి ఉంది . ఊరిబయట కదా, గుప్త నిధుల త్రవ్వకాలు జరిగాయేమో, గుడి లో విగ్రహాలు చేతులు, మెడలు  విరిగిపోయాయి . రాముడి విగ్రహం చూడటానికి బాగుంది . అక్కడే బోరింగ్ ఒకటి ఉంటే నీళ్ళు తాగి కొద్ది సేపు ఆ రాముడి గుడి లో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకున్నాం . అలా రాముడి గుడిలో ఆ కాలం లో కాలక్షేపానికి బండల పైన చెక్కిన ఆటల గురించి చర్చించుకుంటూ కొద్దిసేపు అలా  గడిపాము.

నాకింకా అర్థం కాని విషయం ఏంటి అంటే, "ఎందుకు ఈ జైన గుడి ఇసుకలో పూడుకుపోయింది ", నా విశ్లేషణ ఈ విధం గా సాగింది . పెన్నా కి భయంకరమైన వరద వచ్చి ఇసుకతో కప్పేసింది అనుకుంటే తప్పే, నాకు తెలిసి పెన్నాకి అంత పెద్ద వరదలు ఎప్పుడూ రావు, అస్సలు రావు. హిందువులు, ఆ కాలం నాటి పాలకులు, జైన మత వ్యాప్తి ని అడ్డుకునేందుకు ఈ విధంగా చేసారేమో. ఇదే నిజం అయి ఉండొచ్చు. ఎందుకంటే దొమ్మర నంద్యాల ఊర్లో కూడా జైన విగ్రహాలు దొరికాయి . అక్కడ కూడా ఎవరు జైన మతస్తులు ఇప్పుడు లేరు . అసలు ఈ ప్రాంతం లో జైనులే  లేరు ఇప్పుడు . అంత ప్రాచుర్యం లో ఉన్న జైన మతం ఇలా అంతరించి పోవడానికి కారణమేమిటో ?

దానవులపాడు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు రోడ్ లో దేవగుడి గ్రామం దాటిన తర్వాత వస్తుంది . రోడ్ కి పక్కన ఒక బోర్డు ఉంటుంది . అక్కడ నుండి 2కిమీ లోపలికి  నడవాలి/ మీ సొంత వాహనం లో వెళ్ళవచ్చు . ప్రొద్దుటూరు నుండి 15కిమీ ల దూరం లో ఉంది .

మరికొన్ని  చిత్రాలని కింద slideshow లో చూడొచ్చు . 

Monday, December 16, 2013

ఏ సీమల ఏమైతివో ఏకాకిని నా ప్రియా....

ఏ సీమల ఏమైతివో 
ఏకాకిని నా ప్రియా... 
ఏకాకిని నా ప్రియా...
ఏలాగీ వియోగాన వేగేనో నా ప్రియా...
ఏలాగీ మేఘమాసమేగేనో 
ప్రియా.. 
ప్రియా.. ప్రియా..  ప్రియా...
ఘడియ ఘడియ ఒక శిలయై కదలదు సుమ్మీ..
ఎద లోపల నీ రూపము చెదరదు సుమ్మీ..
పడి రావాలంటే వీలు పడదు సుమ్మీ.. 

వీలు పడదు సుమ్మీ.. 

విరాహ బాధ ని ఇంత కన్నా ఎవరు బాగా చెప్పగలరు. 
మేఘసందేశం చిత్రంలోని ఈ పద్యాలను జేసుదాసు గారి గొంతుతో వింటూ ఉంటే ఏదో తెలియని లోకానికి వెళ్ళినట్లు ఉంది . ప్రతి కవిత లో కవి తన భావన ని, బాధని ఎంతో బాగా చెప్పాడు అంతే వీనుల విందుగా జేసుదాసు గారు వినిపించారు . ఇవే కాకుండా కవితలు చాలా ఉన్నాయి ఈ చిత్రము లో. ప్రతి రోజూ ఎన్నిసార్లు వింటున్నానో తెలియకుండా వింటున్నాను ఈ కవితలని . 


ఈ కవితలని యేసుదాసు గారి గళము లో ఈ క్రింది లంకె ద్వారా వినవచ్చు. 



ఉదయగిరి పయిన  
అదిగొ గగనాన 
కదలె దినరాజు తేరు
ఒదిగి చిరుగాలి 
నిదుర తెర జారి 
కదలె గోదారి నీరు
కదలె గోదారి నీరు

ఊపి ఊపి మనసునొక్కొక్క వేదన 
కావ్యమౌను మరియు గానమౌను
నేటి బాధ నన్ను మాటాడగానీని
 ప్రళయమట్లు వచ్చి పడియె పైని

దారులన్నియు మూసె 
దశ దిశలు ముంచెత్తే 
నీ రంధ్ర భయధాంథకార జీమూతాళి
ప్రేయసీ
ప్రేయసీ
వెడలిపోయితివేల 
ఆ అగమ్య తమస్వినీ గర్భకుహరాల
తమస్వినీ గర్భకుహరాల

లోకమంతా పాకినవి పగటి వెలుగులు
నాకు మాత్రం రాకాసి చీకట్ల మూలుగులు
రాకాసి చీకట్ల మూలుగులు


ఎపుడు నీ పిలుపు వినబడదో 
అపుడు నా అడుగు పడదు 
ఎచటికో పైనమెరుగక 
ఎందుకో వైనమందక 
నా అడుగు పడదు

అది 
ఒకానొక మలు సందె 
ఎదుట
గౌతమీ నది 
ఇరు దరులొరసి 
మింటి చాయలను 
నెమరు వేసుకొనుచు 
సాగినది
అపుడు
అపుడే
కలిగె నాకొక్క దివ్యానుభూతి
కలిగె నాకొక్క దివ్యానుభూతి

శూన్యాకాశము వలె 
చైతన్యలవము లేని 
బ్రతుకు దారుల 
శోభానన్యంబు 
ఒక శంపాలత 
కన్యక 
తొలివలపు వోలె
కాంతులు నించెన్

అంతరాంతరమున
వింత కాంతి నిండి
ఊహలకు రెక్కలొచ్చి
ప్రత్యూష పవన లాలనమునకు విచ్చు సుమాల వోలె.. 
అలతి కవితలు వెలువడే
అంతలోన.....
కనుమొరగిచనెమెరపు 
చీకటులు మిగిలె
అపుడు ఎలుగెత్తి పిలిచినాను
అపుడు దారి తెలియక వెలుగు కొరకు రోదించినాను
రోదించినాను
వెదకి వెదకి వేసారితి 
వెర్రినైతి


ఆశలు రాలి 
ధూళి పడినప్పుడు
గుండెలు చీల్చు వేదనావేశము 
వ్రేల్చినప్పుడు
వివేకము గోల్పడి సల్పినట్టి 
ఆక్రోశము 
రక్తబిందువులలో 
రచియించితి నేను
మేఘసందేశము 
రూపు దాల్చెనది నేడు.
ఇది ఏమి మహా కవిత్వమో!

శోకమొకటియె కాదు 
సుశ్లోకమైన కావ్యమునకు జీవము పోయ
కరుణ ఒకటియే కాదు రసము 
జీవితమున
కవికి వలయు 
ఎన్నో వివిధానుభూతులు 
ఎడద నిండా

నా అన్వేషణ ఎన్నడేన్ సఫలమై
నా మన్కియే 

పూవులున్ 
కాయల్ 
పండ్లును 
నిండు నందనముగా నైనన్
వ్యథావేదనల్ మాయంబై 

సుఖశాంత జీవనము 
సంప్రాప్తించి పూర్ణుండనై
వ్రాయంజాలుదు మానవానుభవదీవ్యత్కావ్య 

సందోహమున్ !!

అంతే  కాకుండా ఈ సినిమా లోని ప్రతి పాట ఒక అద్భుతం అజరామరం . కృష్ణ శాస్త్రి గారి భావ కవిత్వము అమోఘం .