Saturday, April 17, 2021

శతాబ్దాల చరిత్ర ఉన్న పెద్దముడియం ఆలయాలు

 తెలుగు రాష్ట్రాల్లో కడప జిల్లాలోని పెద్దముడియంది చారిత్రకంగా  ప్రత్యేక స్థానం.


చాళుక్య సామ్రాజ్యన్ని స్థాపించిన విష్ణువర్ధనుడు ఈ ఊర్లో పుట్టాడని చరిత్రకారులు నిర్ధారించారు.


తొలి నాటి చాళుక్యుల ఆలయం ఉన్న ప్రదేశం గా గుర్తింపు.


అన్నమయ్య దర్శించి, కీర్తించిన నరసింహస్వామి ఆలయం ఈ ఊర్లో ఉంది.


అద్భుతమైన శిల్పాలు ఇక్కడి దేవాలయాలకి అదనపు ఆకర్షణ


--------------

చరిత్రలో కాస్త వెనక్కి

--------------

త్రిలోచనపురం, బ్రాహ్మలముడియం, ముడివేము అగ్రహారం అని పూర్వ నామాలు ఉన్న ఊరు పెద్దముడియం. ఇక్కడ పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాలలో శాతవాహన కాలం నాటి నాణేలు లభించాయి. తర్వాత కంచి రాజధానిగా పాలించిన పల్లవుల సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. క్రీశ 4-5 శతాబ్దాల కాలం నాటి పల్లవ రాజు త్రిలోచన పల్లవుడు ( ఈయనకి ముక్కంటి కాడువెట్టి అని ఇంకో పేరు, అడవులు నరికించి అగ్రహారాలు ఏర్పాటు చేసారని ఈ పేరు వచ్చింది. ) నిర్మించిన ముక్కంటీశ్వర ఆలయం ఇక్కడ ఉంది. 


ఈ త్రిలోచన పల్లవుడికి, ఉత్తరదేశం నుండి వచ్చిన విజయాదిత్యుడికి పెద్దముడియం దగ్గర జరిగిన యుద్ధంలో విజయాదిత్యుడు చనిపోతాడు. ఈ యుద్ధం జరిగే సమయానికి విజయాదిత్యుని మహారాణి 6 నెలల గర్భవతి. భర్త చనిపోయిన ఈ మహారాణిని పెద్దముడియంలో ఉన్న విష్ణుభట్ట సోమయాజి అనే బ్రాహ్మణుడు చేరదీసి తన సొంత కూతురు లాగా చూసుకుంటూ ఉంటాడు. కొన్నాళ్ళకి, మహారాణి ఒక మగబిడ్డకి జన్మనిస్తుంది. తనని చేరదీసిన విష్ణుభట్టుడికి కృతఙ్ణతతో తన కుమారుడికి విష్ణువర్ధనుడు అని పేరు పెడుతుంది మహారాణి. ఈ విష్ణువర్ధనుడు తర్వాత కాలంలో చాళుక్య సామ్రాజ్యన్ని స్థాపించాడు. 


-------------

పర్యాటక ఆకర్షణలు

-------------

పెద్దముడియం లో ఉన్న చారిత్రక ప్రదేశాలు, ముక్కంటీశ్వర ఆలయం, కాశీ విశ్వనాథాలయం, నరసింహస్వామి ఆలయం, ఈ మూడు ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉంటాయి. వీటికి దగ్గర్లో ఇంకో నరసింహస్వామి ఆలయం, మోడెమ్మ ఆలయం, ఊర్లో కోదండ రామాయలం, ఆంజనేయస్వామి గుడి, శివాలయం ఉన్నాయి. అలానే పాలెగాళ్ళ కాలంలో నిర్మించిన రెండు పెద్ద బురుజులు కోదండరామస్వామి గుడి దగ్గర్లో మనం చూడొచ్చు.


వీటి అన్నింటిలో ముక్కంటీశ్వర ఆలయం అతి పురాతనమైనది. చాళుక్యుల శిల్పకళా ప్రయోగాలకి ఈ ఆలయం ఒక నిదర్శనం. చాళుక్యుల తొలినాటి ఆలయం అని చరిత్రకారులు అనే గుడి ఇదే. శిల్పాలకి వాడిన రాయిని, సముద్రంలో అలలు ఉన్నట్లుగా హెచ్చు తగ్గులుగా చేసి, వాటి మీద శిల్పాలు చెక్కడం అద్భుతం. ముక్కంటీశ్వర ఆలయం శివాలయం, కానీ గుడి గోడల మీద, విష్ణు శిల్పాలు, దుర్గ, విఘ్నేశ్వర, వీరభద్ర శిల్పాలు, అమృత భాండం కోసం గరుడాంజనేయులుకి జరిగే యుద్ధం లాంటి వైష్ణవ మత శిల్పాలు లాంటివి చూస్తే, ఆ కాలం రాజులు, మత సంప్రదాయాలు అన్నింటినీ సమానంగా చూసేవారు అని తెలుస్తుంది.


ముక్కంటీశ్వర ఆలయానికి ఎడమ వైపు ఉన్న చిన్న గుడి కాశీవిశ్వనాథ స్వామి గుడి. కుడి వైపు, నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ నరసింహాలయంలో ద్వారభంధం దగ్గర స్థంభాలు పల్లవ శైలి లో ఉంటాయి. మంటపంలోని స్థంభాలకి వైష్ణవ మత శిల్పాలు ఉన్నాయి. గుడి ఆవరణలో నవగ్రహ మంటపం, వీరభద్రాలయం, గరుదాలయం ఉన్నాయి. పెద్దముడియం చరిత్ర చెప్పే శాసనం, గుడి వెనుక ఉంది.


-------------------------

పెద్దముడియం అష్తదిక్పాలక శిల్పాలు

-------------------------

ముక్కంటీశ్వర ఆలయ శిల్పాలలో ఇంకో అదనపు ఆకర్షణ అష్టదిక్పాలక శిల్పాలు. గుడి 8 మూలలకి, ఈ అష్టదిక్పాలక శిల్పాలు ఉన్నాయి. ఈ దిక్పాలకులని, వారి వాహనాలతో సహా చెక్కడం ఇక్కడ ప్రత్యేకత. వాయు దేవుడికి జింక వాహనం, కుబేరుడికి నరవాహనం, ఇంద్రుడికి ఐరావతం, మేక వాహనం మీద అగ్ని దేవుడు, నైరుతికి గుర్రం, మొసలి మీద వరుణ దేవుడు, యముడు దున్నపోతు వాహనం మీద, ఎద్దు మీద ఈశానుడు లాంటి శిల్పాలని అద్భుతంగా చెక్కారు.


చాళుక్యులకి ఆ కాలంలో వేరే దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండేవి, కాబటి అక్కడి దేవుళ్ళు, ఆకారాలు ఇక్కడి శిల్పాలలో మనం గమనించవచ్చు. ఉదాహరణకి, పర్షియా లో ని లామస్సు, ఇండోనేషియా శిల్పాలలోని కిరీటాలు ఇక్కడ శిల్పాలలో మనం చూడొచ్చు. 


పంచతంత్రం లో మొసలి-కోతి కథ కూడా శిల్పం లాగ ఇక్కడ ఉంది.


--------------------

అన్నమయ్య దర్శించిన ఆలయాలు

--------------------

ఈ ముక్కంటీశ్వరాలయం వెనుక ఉన్న రోడ్ లో ఎడమవైపు కొద్ది దూరం వెళ్తే, వచ్చే నరసింహస్వామి ఆలయాన్ని అన్నమయ్య దర్శించి, ఈ స్వామిపై శృంగార కీర్తన రచించారు. 


"జయ మాయ నీకు నాపె సరసముల నయగారి ముడియము నారసింహా" అని అన్నమయ్య ఈ స్వామిని నయగారి నరసింహుడు అని కీర్తించారు.

ఇక్కడ నరసింహస్వామి, నిలుచున్న భంగిమలో, ఎనిమిది చేతులతో ఉంటారు. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ గుడిలో కూడా అద్భుతమైన శిల్పకళ ఉంది. 


పెద్దముడియం కి 10కిమీ దూరంలో ఉన్న మేడిదిన్నె గ్రామంలో ఆంజనేయస్వామి గుడి ఉంది. అన్నమాచార్యుల వారు ఈ స్వామిని కూడ దర్శించి, ఆంజనేయుని వర్ణిస్తూ కీర్తన రచించారు. 

"చెల్లె నీ చేతలు నీకే చేరి మేదిగుడిదిన్న

నల్లదే కంటిమి నిన్ను హనుమంతరాయ" అని రామాజ్ణతో సముద్రంపైకి లంఘించడానికి సిద్దంగా ఉన్న ఆంజనేయా అని అన్నమయ్య వర్ణించారు.


--------------------

పర్యవేక్షణ

-------------

ప్రస్తుతం పెద్దముడియం ఆలయాలన్ని కేంద్ర పురాతత్వ సంరక్షణలో ఉన్నాయి. ఇక్కడి చరిత్ర కాని, అద్భుతమైన శిల్పాల గురించి చెప్పడానికి ఒక్క గైడ్ కూడ ఉండకపోవడం మన దురదృష్టం. ప్రభుత్వం కూడా పర్యాటకం అభివృద్ధి కి చర్యలు తీసుకోకపోవడం మనం దౌర్భాగ్యం. 


------------

ఎలా చేరుకునేది.

------------


పెద్దముడియం, కడప జిల్లాలో జమ్మలమడుగు నుండి 20కిమీ దూరంలో ఉంటుంది. ప్రముఖ పర్యటక ప్రాంతం అయిన గండికోట దగ్గర్లో ఉన్న ఈ ఆలయాలు, సరైన చర్యలు తీసుకుంటె చేస్తే పర్యటకం అభివృద్ది చెందుతుంది.

Tuesday, April 6, 2021

కడప జిల్లా లోని అగస్త్యేశ్వరాలయాలు

 భారతదేశంలో మొదటి శివలింగం రూపంగా చిత్తూరు జిల్లా గుడిమల్లం ఆలయంలోని శివలింగం అని చరిత్రకారులు చెప్తు ఉంటారు. ఈ శివలింగం పై భాగం మనిషి పురుషాంగం రూపంలో ఉండి, కింద భాగంలో వేటగాడి రూపంలో శివుడి రూపం చెక్కబడి ఉంటుంది.


కడప జిల్లాలో కూడా గుడిమల్లం ఆలయంలోని శివలింగం ఆకారం పైభాగం లాగా ఉన్న అరుదైన శివలింగాలు ఉన్నాయి. వీటిని అగస్త్యేశ్వర శివలింగాలు అంటారు. కడప జిల్లాలో ఉన్న అరుదైన ఆలయాలు ఈ అగస్త్యేశ్వరాలయాలు. సరైన ప్రచారానికి నోచుకోకుండా, జనబాహుళ్యంలో ఈ అరుదైన ఆలయాల గురించి చాల తక్కువ మందికి తెలుసు. 


చరిత్ర ప్రకారంగా చూస్తే, వీటిని రేనాటి చోళుల కాలంలో (క్రీ. శ. 6-9 శతాబ్దాల కాలం)  నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. అగస్త్య మహాముని దక్షిణ భారతదేశ యాత్రలో, తాను బస చేసిన ప్రదేశాలలో శివలింగాలని ప్రతిష్టించారు అని కథనం. తర్వాత కాలంలో శివలింగాల చుట్టూ పుట్టలు ఏర్పడి ఉంటే, రేనాటి చోళ రాజులు, పుట్టలు తవ్వించి ప్రాథమిక గుడి నిర్మాణం చేసినట్లు, గ్రామ కైఫియత్తులు చెప్తున్నాయి.  తర్వాతి కాలంలో చాలా మంది రాజులు, ఈ గుడులని పుర్నర్మించడం, అభివృద్ది చేయడం జరిగింది.


అగస్త్య ప్రతిష్టితమైన ఈ శివలింగాలు భారీలింగ రూపంలో, స్థంభము లగా, తలపైన శిగతో, ప్రత్యేక ఆకారంలో ఉంటున్నాయి. గుడిమల్లం శివలింగం పోలికలు కలిగి ఉంటాయి. 


కింద చెప్పిన ఊర్లళ్ళో ఈ ఆలయాలు ఉన్నాయి.

1) పెద్దశెట్టిపల్లె/నరసింహాపురం శివాలయం (ప్రొద్దుటూరు మండలం), చరిత్ర సంబంధించిన శాసనాలు ఇక్కడ దొరకలేదు. పాత శివాలయం 2020వ సంవత్సరంలో పునర్నిర్మాణం చేశారు. గ్రామ కైఫియత్ ప్రకారం, పూర్వం అగస్త్యాశ్రమంలో ఉన్న శివలింగానికి పుట్టలు తవ్వించి, చోళ రాజులు గుడి నిర్మాణం చేసారని తెలుస్తోంది.



2) ప్రొద్దుటూరు అగస్తేశ్వరాలయం, 8వ శతాబ్దంలో నందిచోళుడు నిర్మించారు. ప్రొద్దుటూరు శివాలయంగా చాలా ప్రసిద్ది పొందిన గుడి ఇది. పార్వతీ దేవి ఆలయము, ఇంకా చాలా ఉపాలయాలతో ఉన్న పెద్ద ఆలయ సముదాయము. 



3) పోట్లదుర్తి (నడిగడ్డ శివాలయం), రేనాటి చోళుల కాలం నాటి గుడి. దగ్గర్లోని మాలెపాడు ఊర్లో రేనాటి చోళుల శాసనాలు లభించాయి. రేనాటి చోళుల కాలం నాటి గుడి. దగ్గర్లోని మాలెపాడు ఊర్లో రేనాటి చోళుల శాసనాలు లభించాయి. రేనాటి చోళ రాజు పుణ్యకుమారుని రాగి రేకుల శాసనం, మాలెపాడులోనే లభించింది.

పోట్లదుర్తి పక్కన పారే వంక, పెన్నానదిలో కలిసే ప్రాంతంలో ఏర్పడిన గడ్డ మీద ఉన్న గుడి కాబట్టీ, ఈ గుడిని నడిగడ్డ శివాలయం అని అంటారు. పార్వతీ దేవి, వీరభద్ర స్వామికి ఒకే ప్రాంగణంలో ఆలయాలు ఉన్నాయి. గుడి బయట, రహదారి అటువైపు, 400 సంవత్సరాల చౌడమ్మ గుడి ఉంది.


4) చిలమకూరు అగస్తేశ్వరాలయం, (యఱ్ఱగుంట్ల మండలం)


8వ శతాబ్దంలో రెండవ విక్రమాదిత్యుని మహారాణి, గుడి పూజకి తోట దానం ఇచ్చినట్లు శాసనం ఉంది. ఒకే ప్రాంగణంలో, వినాయక, వీరభద్రాలయాలు ఉన్నాయి.  
వినాయక, శివాలయాల గర్భగుడి అరుదైన గజపృష్టాకారంలో ఉంటుంది.  ప్రస్తుతం ఈ ఆలయం, కేంద్ర పురాతత్వ శాఖ సంరక్షణలో ఉంది. గుడి ఆవరణలో చాలా శాసనాలు లభించాయి.










5) పెద్దనపాడు శివాలయం( యఱ్ఱగుంట్ల మండలం)

ఇక్కడ శివాలయం అగస్త్యేశ్వరాలయం అని శాసనలలో చెప్పబడినా, శివలింగం అగస్త్యలింగాకార పోలికలు లేవు

ఆలయం గర్భగుడి పైభాగం గజపృష్టాకారంలో ఉంటుంది. ఇటీవల ఈ ఆలయాన్ని పునర్మించినట్లు తెలిసింది. ఇక్కడ మనకి 11వ శతాబ్దపు, కాయస్థ రాజుల శాసనంలో, అగస్త్యేశ్వరస్వామి పూజలకి, భూమి దానం చేసినట్లు శాసనం ఉంది.



ఇక్కడ వీరభద్రాలయము, ఆంజనేయస్వామి ఆలయయు, మదనగోపాల స్వామి ఆలయము ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. వీరభద్రస్వామిని 14వ శతాబ్దంలో ప్రతిష్ట చేసినట్లు శాసనం ఉంది.





6) ఉరుటూరు శివాలయం (యఱ్ఱగుంట్ల మండలం)

ఇక్కడి శివలింగం నిధుల వేటగాళ్ళ వల్ల విరిగిపోతే, ప్రస్తుతం మైలవరం మ్యూజియం లో భద్రపరిచారు.








7) పెద్దచెప్పలి అగస్తేశ్వరాలయం (కమలాపురం మండలం)

6వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగిందని శాసనాలు లభ్యమవుతున్నాయి. గుడి, గజపృష్టాకారంలో ఉంటుంది. ఒకే ప్రాంగణంలో చెన్నకేశవాలయం కూడా ఉంది. ఇక్కడి చెన్నకేశవస్వామిని అన్నమయ్య దర్శించి కీర్తన రచించారు. ఈ పెద్దచెప్పలి గ్రామము, ఒక నాటి, రేనాటి చోళుల రాజధాని అని చరిత్రకారులు నిర్ధారించారు.



8) చదిపిరాళ్ళ అగస్తేశ్వరాలయం (కమలాపురం మండలం)



రేనాటి చోళుల కాలం నాటిది. ఈ ఆలయం గర్భగుడి కూడా గజపృష్టాకారంలో ఉంటుంది. ఇక్కడ విజయనగర రాజుల కాలం నాటి చాలా శాసనాలు లభించాయి. గుడికి దగ్గర్లో పురాతన్ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది.






9) కల్లూరు (ప్రొద్దుటూరు మండలం), 




ఇక్కడ అగస్త్యేశ్వరాలయం కూడా రేనాటి చోళుల కాలం నాటిది. ఒకే ప్రాంగణంలో చెన్నకేశవాలయం ఇక్కడ ఉంది. చాలా పురాతన ఈ గుడిలో, విజయనగర రాజుల కాలం నాటి శాసనాలు లభిస్తున్నాయి. చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో, అనంతపద్మనాభస్వామి దేవాలయము, శివాలయల్ ప్రాంగణంలో, వీరభద్రాలయము ఉన్నాయు.

10. ఎర్రగుంట్ల కోడూరు, ఎర్రగుంట్ల ఊరికి 5 కిమీ దూరంలో ఉంటుండి, ఈ ఊర్లో ఒక అగస్త్యేశ్వర శివలింగం ఉంది.

11. నిడుజువ్వి, ఎర్రగుంట్లకి 4 కిమీ దూరంలో ఉంది, ఇక్కడ కూడా ఒక అగస్త్యేశ్వర కొప్పు శివలింగం ఉంది.



12. జ్యోతి సిద్దవటం, శ్రీశైల దక్షిణ ద్వారం. ఇక్కడ కూడా అగస్త్యేశ్వర శివలింగం ఉంది.